వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి


వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి


ఈ వ్రతాన్ని ఆయా కుటుంబాల్లో వంశపారంపర్యంగా వస్తుంటుంది. దీన్ని పెద్దల నుంచి అంటే అత్తగారి నుంచి లేదా అమ్మగారి నుంచి పట్టుకోవాలి. ఒకవేళ వ్రతం చేసే ఆచారం ఆయా కుటుంబాలలో లేకుంటే కేవలం వరలక్ష్మీ అమ్మవారిని పటం లేదా విగ్రహాన్ని లేదా కలశాన్ని ఏర్పాటుచేసుకుని కలశం పూజ, గణపతి ఆరాధన, లక్ష్మీ అష్టోతరం, మంగళారతి పాటలు పాడి తియ్యని నైవేద్యాలు, కొబ్బరికాయ, పండ్లు దానిమ్మ, అరటి తదితర పండ్లు నైవేద్యంగా సమర్పించి మంగళారతి ఇచ్చి ప్రసాదాన్ని స్వీకరించాలి.



ముతైదువులకు పసుపు, కుంకుమ, పండ్లు, శక్తి ఉంటే జాకెట్ పీసులు, వస్త్రదానం లాంటివి చేయాలి. దీనివల్ల ఐదోతనంతోపాటు ఇంట్లో సర్వసౌభాగ్యాలు కలుగుతాయి. అన్నింటికంటే ప్రధానం భక్తి,శ్రద్ధ. ఈ వ్రతం చేసినా ఆడంబరాల కంటే భక్తి ప్రధానంగా చేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేది శాస్త్ర ప్రవచనం. భక్తితో వ్రతం చేస్తే వరాలందించే తల్లి వరలక్ష్మీ దేవి. ఈ వ్రతాన్ని ఆచరించడానికి నిష్ఠలు, నియమాలు, మడులు పాటించినా, పాటించకపోయినా నిశ్చలమైన భక్తి, శ్రద్ధ ఉండాలి. 



ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృప కలిగి ఐశ్వర్యం లభిస్తుంది. సకల శుభాలు కలుగుతాయి. ఐశ్వర్యం అంటే కేవలం ధనం మాత్రమే కాదు. ఆరోగ్యం, సంతానం, ధాన్యం, పశు సంపద, గుణ, జ్ఞానం తదితరాలు. వ్రతం అనేసరికి అమ్మవారికి ఎంతెంత పూజ చేయాలో, ఎన్నెన్ని నైవేద్యాలు పెట్టాలో అని భయపడనక్కరలేదు. మన శక్తిమేర శుచి, శుభ్రతతో ఆహారాన్ని వండాలి. వీలైతే, చేతనైన పిండివంటలు చేయాలి. ఇంటికి వచ్చిన పేరంటాళ్లకు మర్యాద చేసి, కాళ్లకు పసుపు రాసి, నుదుట బొట్టు, మెడకు గంధం పెట్టి, చేతికి తోరం కట్టి, చేతిలో పండ్లు, తాంబూలం పెట్టి, నమస్కరించి, ఆశీస్సులు అందుకోవాలి.


పూజకు కావలసినవి


పసుపు, కుంకుమ, వాయనం ఇవ్వడానికి (నానబెట్టిన శనగలు) అవసరమైన వస్తువులు, ఎర్రటి రవికెబట్ట, గంధం, పూలు, పండ్లు, ఆకులు, వక్కలు, తోరాలు కట్టుకోవడానికి దారం, టెంకాయలు, దీపపు కుందులు, ఐదువత్తులతో దీపారాధన సెమ్మలు, హారతి ఇవ్వడానికి, అవసరమైన పంచహారతి, దీపారాధనకు నెయ్యి, కర్పూరం, అగరువత్తులు, బియ్యం, శనగలు, నైవేద్యానికి తియ్యని పదార్థాలను ఇంట్లో చేసినవి మొదలైనవి సమకూర్చుకుని వ్రతాన్ని ప్రారంభించాలి.

వ్రత విధానం


ఉదయాన్నే లేచి తలస్నానం చేసి, ఇంటిని శుభ్రం చేసుకోవాలి. ఇంట్లోని పూజామందిరంలో మండపాన్ని ఏర్పాటు చేసుకోవాలి. మండపం పైన బియ్యపుపిండితో ముగ్గువేసి, కలశం ఏర్పాటు చేసుకోవాలి. అమ్మవారి ప్రతిమ లేదా ఫొటో అమర్చుకోవాలి. ముందుగా గణపతి పూజ చేసుకుని, నివేదన, హారతి ఇచ్చిన తర్వాత అమ్మవారిని ధ్యాన ఆవాహనాది శోడశోపచారాలతో పూజించుకోవాలి. వ్రత కథ చదువుకుని, అక్షతలు శిరస్సున ధరించాలి. ముత్తయిదువలకు వాయినాలు, తాంబూలాలు ఇవ్వాలి. అనంతరం బంధుమిత్రులతో కలసి భుజించాలి.

ఈ తోరగ్రంథి పూజ ముగిసిన తర్వాత…!


బధ్నామి దక్షిణేహస్తే నవసూత్రం శుభప్రదం పుత్రపౌత్రాధివృద్ధించ మమసౌఖ్యం దేహిమే రమే!!అనే శ్లోకాన్ని చదువుతూ ఆ తోరాన్ని ధరించాలి. తోరాన్ని తప్పకుండా కుడిచేతికే ధరించాలి. అంతేకాదు, ఇలా ధరించిన తోరాన్ని కనీసం ఒక రాత్రి, ఒక పగలన్నా ఉంచుకోవడం మంచిది.




Previous
Next Post »