ఇవేం ‘ఛీ’ రియ‌ల్స్ ?

 మనం కాలక్షేపం కోసమేనని ఎంతనుకున్నా- ఏ మాధ్యమమూ కాలక్షేపానికే పరిమితం అవ్వదు. కొందరి ప్రయోజనాలను నెరవేర్చటానికి, మరికొందరి ప్రాధామ్యాలను మసకబార్చటానికి అది దోహదం చేస్తుంది. మన ఇళ్లలో తిష్ట వేసిన టీవీ చేస్తున్న పని అదే! గత పాతికేళ్లలో వినిమయ సంస్కృతి ఇంతగా విస్తరించటంలో టీవీది చాలా పెద్ద పాత్ర. మానవ సంబంధాల్లో ముందెన్నడూ లేని మూస, మోసపూరిత, వ్యాపార, వినిమయ సంస్కృతిని జొప్పించింది. చొప్పిస్తూనే ఉంది..! ప్రధానంగా సీరియళ్ల రూపంలో ఆ భావపరంపర ప్రవహిస్తోంది. ఛీ అనుకుంటూనే చూస్తున్న జనాన్ని అది పెద్ద సంఖ్యలో సంపాదించుకోవడం విశేషం.

ప్రస్తుతం తెలుగులో వస్తున్న సీరియల్‌ టైటిల్స్‌ అన్నీ స్త్రీల మూర్తులతో ముడిపడి ఉన్నాయి. వాటిలో డబ్బున్న కుటుంబాల ఆచార అలవాట్లనే అధిక ప్రాధాన్యం ఇచ్చి చూపిస్తున్నారు. సమాజంలో మహిళలు అణచివేతకు గురవుతుండడం ఒక సత్యమైతే- దానికి భిన్నంగా మహిళలనే ఆధిపత్యం, కుట్రలు, కుతంత్రాలు, ఎత్తుకుపై bత్తులు ప్రదర్శించగల పాత్రలుగా మలిచి హోరెత్తిస్తున్నారు. స్వేచ్ఛ పేరుతో దురలవాట్లు, వ్యసనాలకు బానిసలు కావడం, వెకిలిగా మాట్లాడటం, క్రూరంగా ప్రవర్తించడం ... చూపిస్తున్నారు. ఎక్కువ సీరియల్స్‌లో కత్తి పట్టేది, తుపాకి పేల్చేది, గొడ్డలితో నరికేది కూడా నారీమణులే! మహిళ సహజ ప్రకృతికి విరుద్ధమైన కర్కశత్వం, కాఠిన్యం, ప్రతీకారేచ్ఛ, కుట్ర వంటి స్వభావ సంభాషణలతో మహిళా పాత్రలను తీర్చిదిద్దుతున్నారు.

సీరియల్స్‌లోని స్త్రీపాత్రలు కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేసే దిశలో రూపుదిద్దుకుంటున్నాయి. యువతీయువకులు, పరిణితి చెందిన మహిళా సమాజాన్ని కూడా ఇవి పక్కదారి పట్టించే విధంగా ఉంటున్నాయి. స్త్రీల ప్రవృత్తిని పూర్తి వ్యతిరేక దిశలో సృష్టిస్తున్నారు. మూఢ విశ్వాసాలు, క్షుద్రపూజ విద్యలు, చేతబడులు, దెయ్యాలు, కర్మసిద్ధాంతం, పాప పరిహారం లాంటి వాటిపై విశ్వాసాన్ని పెంచే దిశలో తీవ్ర ప్రయత్నం చేస్తున్నారు. వైజ్ఞానిక రంగం ఇచ్చిన ఆయుధాలతో దానికి భిన్నమైన అజ్ఞానాన్ని, అంధకారాన్ని సృష్టిస్తున్నారు. నవసమాజాన్ని వెనక్కి లాగుతున్నారు. అభం శుభం తెలియని పసిపిల్లల చేత 'ఓరోరి యోగి నన్ను కొరికెయ్యరో' అనిపించటం కూడా బుల్లితెరలపై ఒక అరాచక చర్య. ఇలా చేయడం తప్పు కాదనే భావనకి పిల్లలను, వారి తల్లితండ్రులను గురి చేయడం టీవీ మాయ. ఈ మూడు నిమిషాల ప్రోగ్రామే ముందు ముందు సమాజానికి ఉరితాడు అవుతుందని ప్రేక్షకులూ ఊహించలేకపోతున్నారు.

గ్రామసీమల్లో వరినాట్లు, కోతలు, కుప్పనూర్పిడి, మట్టి పనులు చేసేటప్పుడు తమ కష్టాన్ని మరచి పోవడానికి జానపదులు పాటలు పాడుకొనేవారు గతంలో. ఇప్పుడు టీవీ సీరియల్స్‌లోని క్యారెక్టర్స్‌ గురించి చర్చింకుంటున్నారు. ఏనాడో మార్క్స్‌ మహనీయుడు 'మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే' అన్నాడు. అవి ఈ రోజున సీరియల్స్‌ సంబంధాలుగా మారిపోతున్నాయి'. (దానిలో ఆర్థిక సంబంధం ఉంది.) ఆమధ్య భర్త టీవి సీరియల్‌ చూడొద్దన్నందుకు మనస్తాపం చెందిన భార్య ఒంటిపై కిరోసిన్‌ పోసుకొని నిప్పంటించుకొంది. అనంతరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. మానవ సంబంధాలు అవమానవ సంబంధాలుగా మారిపోతున్నాయి.
టీవీ లేకపోతే గడియ గడవదన్న రీతిగా జనాన్ని మార్చేసింది వినిమయ సంస్కృతి.. ఏ ప్రశ్నకైనా, ఎలాంటి చిక్కుముడికైనా టీవి ఆన్‌ చేస్తే సమాధానం అందులో దొరుకుతుందనే భ్రమలో బతికేటట్లు చేసేసింది. అందుకేనేమో ప్రజాగాయకుడు గద్దర్‌ 'కయ్యం బెట్టిందిరో కలర్‌ టీవి ఇంట్లోకొచ్చి, దయ్యం బట్టిందిరో నా పెళ్ళాం పోరలకు' అనే పాట రాయకుండా ఉండలేకపోయాడు. ఇలాంటి సీరియల్స్‌ చూస్తున్న కొత్తగా సంసార జీవనంలోకి అడుగిడుతున్న యవ్వనస్తుల మనోభావాలపై కొత్తదనం కోసం సృష్టిస్తున్న పాత్రలు, వాటి ప్రభావాలు సమాజ సంక్షోభానికి కారణాలవుతున్నాయి. అస్తవ్యస్త జీవనశైలికి పునాదులవుతున్నాయి. సీరియల్స్‌లో చూపిస్తున్న హింస, మానసిక సంఘర్షణలు, ఒత్తిళ్లూ మానవత్వాన్ని మసకబారుస్తున్నాయి.

ధారావాహికల్లో ప్రేమ ఆప్యాయతలు ఎక్కడా సహజ సిద్ధంగా కన్పించవు. జంతుప్రేమలు, జంతుద్వేషాలతో మానవ సంబంధాలు ఆటవిక సమాజాన్ని తలపిస్తున్నాయి. పరిణతి చెందిన వయోపాత్రలు కూడా స్వార్థ భావాలకు లోనై రేపటి పౌరుల భవిష్యత్తుకు గొడ్డలిపెట్టుగా మారింది. సుదీర్ఘకాలంగా భావోద్వేగాల సీరియల్స్‌ చూడడంవల్ల ప్రేక్షకులు 'యాంగ్జయిటీ న్యూరోసిస్‌' అనే మానసిక వ్యాధికి గురతున్నట్లు మానసిక వైద్యులు పేర్కొంటున్నారు. ఇలాంటి సీరియల్స్‌ బహుశా ప్రపంచంలో ఏ భాషా సమాజంలోనూ లేవేమో! సాగతీత ధోరణితో అటు దృశ్యాన్ని ఇటు సంభాషణలను అసహజ ధోరణితో లాగిలాగి ఉత్కంఠ నెలకొల్పి ఊహజీవులుగా మార్చి వేస్తున్నారు.
సాంఘిక విలువలు, మానవతా విలువలను పక్కనపెట్టి యువతరం బలహీనతలను వాడుకునే విషసంస్కృతి పెరిగింది. ఆధునిక సాంకేతికతో విపరీతమైన ఖర్చుతో నిర్మించే సీరియల్స్‌ సంఖ్య పెరిగింది. కథ కంటే దాని సాగదీతకు, భావోద్వేగాలకు, నాటకీయతకు ప్రాధాన్యత పెరిగింది. హింస, హత్యలు, కిడ్నాపులు, మాయలూ మంత్రాలూ బాగా పెరిగాయి.

టీవీలకు వచ్చే ఆదాయంలో 90 శాతం వాణిజ్య ప్రకటనల రూపంలోనే లభిస్తున్నాయి. దీనికి టిఆర్‌పి రేటింగ్‌ అవసరం. అందుకోసం జనాన్ని టీవీ వదిలిపోని విధంగా మాయాజాలం చేయడం పెరిగింది. ఈ ధోరణిపై ఒక నియంత్రణ ఉండాలి. టీవీల్లో ప్రసారమయ్యే సీరియల్స్‌కు కూడా ప్రత్యేకంగా సెన్సార్‌బోర్డు ఉండాలి. వాణిజ్య ప్రకటనల్లో చెప్పే విషయం, క్యాప్షన్లు ఎంతవరకూ నిజమో, సాధ్యమో ప్రభుత్వం వద్ద రుజువైతేనే ప్రసారం చెయ్యాలి. వీటిపై సామాజిక సెన్సార్‌షిప్‌ చాలా అవసరం. ఉదాహరణకు కూల్‌డ్రింగ్‌ తాగితే లైన్‌ క్లియర్‌ అంటే ఎలా? శీతల పానీయాలు దాహం కోసమా? మరో ప్రయోజనం కోసమా?

యువ ప్రేక్షకులు వీటివల్ల చైతన్యం కంటే కొత్త సంస్కృతికి అలవాటు పడుతున్నారు. సినిమా, టీవీ నిర్మాణంలో సాంఘిక ప్రయోజనాల కంటే వ్యాపార దృష్టి, హింస, ప్రతీకారం, అసూయ, అతి ప్రదర్శన వంటి ధోరణులకు ప్రాధాన్యం పెరిగింది. 1931-45 మధ్యకాలంలో గూడవల్లి రామబ్రహ్మం 'మాలపిల్ల', 'రైతుబిడ్డ' వంటి సినిమాలు తీశారు. అప్పటి బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ చిత్రాలను నిషేధించింది. రాజకీయ చైతన్యానికి, సంస్కరణోద్యమానికి సినిమాను చక్కగా ఉపయోగించుకున్నారు. మరి నేడు అలాంటి మూవీ మూగబోయి మనీమనీ, మోర్‌మని అంటున్నది.
కూలిపోతున్న మానవ సంబంధాలు

టెలివిజన్‌లో ధారావాహికలు, ధారాళంగా దూసుకుపోతున్న దశలో మానవ సంబంధాలు ఎలా మారుతున్నాయో పరిశీలించాలి. యాంత్రిక జీవనానికి అలవాటు పడిన మనిషి ప్రపంచాన్ని దూరదర్శన్‌లో తిలకిస్తున్నాడు. బుల్లి తెరలో కృత్రిమంగా సృష్టించబడిన పాత్రలు, సన్నివేశాల ప్రభావంతో మనుషులు అసహజమైన అయోమయ ప్రపంచంలో గడుపుతున్నారు. వర్ధమాన సగటు జీవికి కరెంటు, స్విచ్‌, డిష్‌, రిమోట్‌, టీవి... ఈ పంచభూతాలతో తప్ప మరొక దానితో సంబంధం ఉండడం లేదు. ఇరుగు పొరుగు వారితోగాని, గృహాలతోగాని, ఆ బజారులో నివసించే వారితోగాని కనీస పరిచయాలు, మాటా మంచి కరువవుతున్నాయి. దీనివల్ల మనిషి తనకు తెలియకుండానే ఒంటరైపోతున్నాడు. చిన్నపిల్లలు, వృద్ధుల సంగతి సరేసరి. ప్రపంచం ఒక కుగ్రామమైన ప్రపంచీకరణ అంటున్నారు కానీ, ప్రతి ఒక్కరూ ఏకాకులై జీవిస్తున్నారు. నిజ ప్రపంచాన్ని పక్కనపెట్టి టీవీతోనే సహజీవనం సాగిస్తున్నారు.
విపరీత పోకడలు పోతున్న టీవీ మాధ్యమంపై కచ్చితంగా నియంత్రణ ఉండాలి. దానికి విజ్ఞులైన పౌరులు పూనుకోవాలి. చిన్న చిన్న పట్టణాల్లో సైతం వీక్షక సంఘాలుగా ఏర్పడి, టీవీ ప్రసారాల మంచిచెడ్డలు విశ్లేషించాలి. టీవీ ఒక గొప్ప వైజ్ఞానిక ఆయుధం. కాలక్షేపం పేరుతో అది ఎలా ఆడితే మనం అలా ఆడడం కాదు. అది ఉండాలో మనం చెప్పాలి. వినేంతవరకూ చెప్పాలి. అది పౌరుల బాధ్యత.

Disclaimer :: This Post Is Educational Purpose Only If It Violates your rights or else if you think it targets any of you individually you can feel free to comment here thank you.
Previous
Next Post »

1 Comments:

Write Comments
September 24, 2018 at 9:24 AM delete

కేసీఆర్ గారిని హేళన చేసినందుకు రెండు టీవీ చానెళ్ళను నిషేదించారు.మళ్ళీ ఎవ్వరూ కూడా ఆయనను విమర్శించే సాహసం చేయలేదు.ఈ సీరియళ్ళ విషయంలో కూడా ఏ మహానుభావుడో పూనుకుని నియంత్రిస్తే తప్ప మనమెంత మొత్తుకున్నా ప్రయోజనం లేదు.

Reply
avatar