కాలభైరవ స్వరూపం.. ప్రసన్నమూర్తి తత్వం





నమో భూతనాథం నమో ప్రేతనాథం

నమః కాలకాలం నమః రుద్రమాలమ్‌

నమః కాలికాప్రేమలోలం కరాలం

నమో భైరవం కాశికాక్షేత్రపాలమ్‌॥

పూర్వం ఒకసారి ఋషులకు త్రిమూర్తులలో అసలు బ్రహ్మమెవరని సందేహం వచ్చింది. ఆ సందేహాన్ని తీర్చమని వారు త్రిమూర్తులనే అడిగారు. శంకరుడికి ‘సద్యోదాత, అఘోర, తత్పురుష, ఈశాన, వామదేవ అను అయిదు ముఖాలు ఉంటాయి. ఈ అయిదు ముఖాలతో ఋషుల వంక చూస్తూ అన్నాడు ‘అదేమిటయ్యా బ్రహ్మమెవరని అడుగుతారేమిటి? నేనే బ్రహ్మాన్ని’ అన్నాడు. 



అప్పుడు బ్రహ్మగారు ‘నేనే ఈ లోకాలనన్నింటిని సృష్టించాను నేనే కర్తను. నేనే వీటిని సంహారం చేస్తాను. నేనెప్పుడూ బతికే ఉంటాను. కాబట్టి నాకన్నా బ్రహ్మమెవరు? నేనే బ్రహ్మాన్ని’ అన్నాడు. తరువాత పక్కనున్న విష్ణువు ‘బ్రహ్మా’ అసలు నీవు పుట్టింది నా నాభి కమలంలోంచి కదా! బ్రహ్మాన్ని నేను’ అన్నారు. ఇద్దరికీ ఈ విషయంలో జగడం వచ్చింది. 


మనకి శృతి ప్రమాణమైన వేదాలని పిలుద్దాం అని వేదాలని పిలిచారు. అప్పుడు ఋగ్వేదం,  సృష్టిచేయాలని సంకల్పించి మొదటగా నారాయణుడు జన్మించాడో, ఎవడు చిట్టచివర ఈ లోకాలని తనలోకి తీసుకుంటున్నాడో అటువంటి ఆ పరమశివుడు పరబ్రహ్మాం అంది. దాన్ని వెళ్లమని యజుర్వేదాన్ని పిలిచారు. అసురీశక్తులు పోయి ఈశ్వరీ శక్తులు రావడానికి జ్ఞానాన్ని ఇచ్చేది మహేశ్వరుడు.

కాబట్టి జ్ఞాన యజ్ఞంలో ఆరాధింపబడే వాడు కనుక పరమశివుడే పరబ్రహ్మం అని చెప్పింది. తరువాత సామవేదాన్ని అడుగగా, మూడు కన్నులున్న వాడు ఈ లోకాన్నంతటినీ తిప్పుతున్నాడో, వానిని ఏ యోగులు ఉపాసన చేస్తున్నారో, ఏ యోగులకి ఉపాసన ద్వారా జ్ఞానం తెలియచేస్తున్నాడో, ఎవరు, ‘తనలో తాను రమించేటి శివుడు పరబ్రహ్మం’ అని చెప్పింది.

పిమ్మట అధర్వణ వేదం ఏ మహానుభావుడిని భక్తులందరూ సంసార సాగరం దాటి దుఃఖాన్ని పోగొట్టుకుని ఆనందాన్ని తెలుసుకోవడానికి ఉపాసన చేస్తున్నారో అటువంటి పరమశివుడు పరబ్రహ్మం’ అని చెప్పింది. అంటే సృష్టి చేసింది మనం కాదు, నిలబెట్టింది మనం కాదు, వేరొకడున్నాడు. తెలుసుకో అని శాస్త్ర ప్రమాణం, నాలుగు వేదాలు అదే చెప్తున్నారు. 

ఇప్పుడు ప్రణవాన్ని పిలిచారు. అపుడు ప్రణవం ఎవడు నిరంతరం శక్తి స్వరూపంతో క్రీడిస్తూ ఉంటాడో, శక్తి ఆయనను విడిచిపెట్టి ఉండదో, శక్తీశ్వరులై వారున్నారో, అటువంటి శక్తీశ్వరుడై శక్తి ఆయనతో, ఆయన శక్తితో విడివడకుండా కలిసి ఉంటారో అటువంటి పార్వతీ పరమేశ్వరులు, పార్వతి వామార్థ భాగంలో ఉన్న శంకరుడే పరబ్రహ్మం’ అని చెప్పింది. 

ప్రణవం చెప్పిన మాటను వాళ్ళు అంగీకరించలేదు. ఈమాటలు రుచించక పోతే ఇప్పుడు ఈశ్వరుడు దండించవలసి ఉంటుంది. కాబట్టి ఈశ్వరుడు అంతటా నిండిన పరబ్రహ్మ జ్యోతిగా మారింది. జ్యోతి సాకారం అయింది. సాకారాన్ని చూసినప్పుడు విష్ణువు ఊరుకున్నాడు. కానీ బ్రహ్మ నీవు ఎవరు? నువ్వు నా రెండు కనుబొమల మధ్యలోంచి పుట్టిన రుద్రుడవు. నన్ను స్తోత్రం చెయ్యి’ అన్నాడు. బ్రహ్మలో మార్పు రాలేదు.

అతనిని దండించాలి. కాబట్టి ఇప్పుడు ఆ జ్యోతి ఘోర రూపం పొందింది. ‘ఏమి నీ ఆజ్ఞ అని మొదటి రూపాన్ని అడిగాడు. అహంకారంతో మాట్లాడుతున్నాడు. అయిదవ తలను గిల్లెయ్యి’ అంది. ఇప్పుడు ఈ స్వరూపం ప్రచండ రూపాన్ని పొందింది. దిగంబరమై అయిదవతలను గోటితో గిల్లేసింది. 

ఆ రూపమే కాలభైరవ స్వరూపం. ఇలా జరిగేసరికి బ్రహ్మ నాలుగు తలకాయలు పట్టుకు వెళ్లి అమ్మవారి చేతుల క్రింద పెట్టగా ఈశ్వరా, నేను చేసిన పొరపాటు మన్నించి ఉదారుడవై నన్ను కాపాడు అన్నాడు. అప్పుడు శంకరుడు కాల భైరవునితో నీవు కాలం వలె ప్రకాశించుచున్నావు. కాలం ఎలా వెళ్ళిపోతూ ఉంటుందో అలా ఉంది నీ నడక. నీ నడకలో బ్రహ్మ తల తెగిపోయింది. 

కాబట్టి నిన్ను ఈ రోజు నుంచి కాలభైరవ అని పిలుస్తారు. నీవు ఎంత గొప్ప వాడవయినా బ్రహ్మ తల తెంపేశావు కాబట్టి నీకు బ్రహ్మహత్యాపాతకం అంటుకుంది. ఈ అయిదవ తలకాయ పుర్రెను చేతిలో పట్టుకుని పన్నెండు సంవత్సరాలు భిక్షాటన చేసి ఆ కపాలంలో తిను. అప్పుడు నీ బ్రహ్మ హత్యా పాతకం పోతుంది. నీ స్వరూపం పుట్టేటప్పటికీ చూసేటప్పటికీ లోకమంతా గజగజలాడింది.

కాబట్టి నిన్ను భైరవ శబ్దంతో పిలుస్తారు. ఎవడు ఈశ్వరుని ధిక్కరించి ఇక్కడ బతుకుతాడో వాడి ప్రాణోత్క్రమణం అవగానే నువ్వే కనపడతావు. దీనిని ‘భైరవ యాతన’ అంటారు. అప్పుడు జీవుడు నిన్ను చూసి హడలిపోతాడు. కానీ ఎవరు నీ గురించి వింటారో, శివాలయానికి వచ్చినపుడు ఎవరు కాలభైరవుడి ముందు శిరస్సు వంచి నమస్కరిస్తారో వాళ్ళ పాపాన్ని, నీవు తీసెయ్యి.

అలా తీసేసే శక్తిని నేను నీకు ఇచ్చాను కాబట్టి నిన్ను ‘అమర్దకుడు’ అని పిలుస్తారు. ఇకనుంచి నీవు నా ఆలయంలో క్షేత్ర పాలకుడవయి ఉంటావు. భక్తుల పాపాలను తీసి వాటిని నువ్వు తినేసెయ్యి. నువ్వు పాపాలను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు ‘పాప భక్షకుడు’ అనే పేరును ఇస్తున్నాను. నిన్ను కాశీ క్షేత్రానికి అధిపతిగా ఉంచుతున్నాను. నీ అనుగ్రహం ఉన్నవాళ్ళే కాశీక్షేత్ర ప్రవేశం చేస్తారు’ అని చెప్పాడు.

అందుకే కాశీక్షేత్రంలోని కాలభైరవుడు, మనల్ని ఆ క్షేత్రప్రవేశానికి అనుమతించేది కనుక అయ్యా నాకు లోపలికి ప్రవేశానిచ్చి నా పాపాలను దగ్ధం చేశావు కాలభైరవా’ అని ఆ మహానుభావుడికి ఇంటికి రాగానే కృతజ్ఞతా పూర్వకంగా కాలభైరవ పూజ చేసి ఇకనుంచి మంచి పనులు చేస్తాను అని అన్న సంతర్పణ చేస్తారు. 

భైరవ మూర్తి ప్రసన్నమూర్తి అయినాడని చెప్పడానికే ఆయన మెడలో ఒక గారెల దండ వేస్తారు. కాశీ సంతర్పణ చేస్తే తప్పకుండా వెళ్లి ఆ ప్రసాదాన్ని తీసుకోవాలి. ఇహలోకంలో ఇప్పటివరకు ఈశ్వరుడి పట్ల చేసిన దూషణల ఫలితం ఎలా పోతుందని బెంగపడే వాళ్ళకు భైరవ యాతన ఇక్కడే తేలికగా అనుభవింప చేస్తాడు. అందుకే హరిద్వార్, ఋషికేశ్ వెళ్ళిన వాళ్ళు మానసా దేవి ఆలయానికి వెళ్తే బయటకు వచ్చేటప్పుడు ‘ఒకసారి ఒంగోండి’ అని ఒక బెత్తం పెట్టి వీపు మీద కొడతారు.

అది భైరవ యాతన అని ఆ కర్ర ఠప్ అంటుంది. అక్కడితో పాపాలు పోతాయి. ఈవిధంగా ఆ నాడు పరమేశ్వరుడు కాల భైరవుడికి ఇన్ని వరాలను గుప్పించాడు. ఆ మూర్తే ప్రతి శివాలయంలో ఈశ్వర ఆజ్ఞను అంగీకరించి వచ్చాడు. కనుక మహానుభావుడు కాలభైరవ స్వరూపంతో భక్తుల పాలిట కొంగుబంగారం అయ్యాడు. ఎవరు ఈశ్వర ధిక్కారం చేస్తాడో వారి పాలిట భైరవ దర్శనంగా భయంకరంగా కనపడతాడు.

కాబట్టి ఆ కాలభైరవ స్వరూపం అంత గొప్పది. ‘మేము కాశీ వెళ్ళాము మాకు ఇంట ఏ భయం లేదు’ అని చెప్పడానికి ఒక నల్లతాడును రక్షగా కూడా కట్టుకుంటారు. ఎవరు ఈ కాలభైరవ స్వరూపం గురించి వింటున్నారో.. భక్తితో ప్రణమిల్లుతున్నారో.. నమస్కరిస్తున్నారో .. అటువంటి వారు శివానుగ్రహాన్ని పొందుతారు. కాలభైరవుడు వాళ్ళని ఇబ్బంది పెట్టడు. వాళ్ళు ఎప్పుడూ ఎంతో సంతోషంగా, సుఖంగా ఉంటారు. 

ఓం నమః శివాయ..
Previous
Next Post »